Sabarimala Ayyappa Swamy : కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో మండలపూజ, మకర విళక్కు వార్షిక పూజలు ఘనంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని మూసివేశారు.

పందలం రాజ కుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్ రాజరాజ వర్మ అయ్యప్ప దర్శనం చేసుకున్న అనంతరం సోమవారం ఉదయం 6.30 గంటలకు ఆలయాన్ని మూసివేశామని ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు అధికారులు తెలిపారు. 53 లక్షల మందికిపైగా భక్తులు అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారని ఆలయన అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.
రెండు నెలలు పాటు జరిగే మండల-మకర విళక్కు వార్షిక పూజల కోసం నవంబర్ 15న ఆలయాన్ని పూజారులు తెరిచారు. మండల పూజ అనంతరం డిసెంబర్ 26న గుడిని మూసివేశారు. 41 రోజులపాటు సాగిన పూజల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు.
శబరిమల (Sabarimala) అయ్యప్ప స్వామిని దర్శించుకున్న 53లక్షల మంది భక్తులు
నాలుగు రోజుల విరామం తర్వాత డిసెంబర్ 30న సాయంత్రం 4 గంటలకు మళ్లీ ఆలయాన్ని తెరిచారు. ఈ సీజన్లో ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. మొత్తం 53 లక్షల మందికిపైగా భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయాన్ని తెరిచి, తూర్పు మండపంలో గణపతి హెూమం చేశామని.. ఆ తర్వాత మేల్శాంతి అరుణ్ కుమార్ నంబూద్రి అయ్యప్ప విగ్రహానికి విభూతాభిషేకం నిర్వహించి, దానిని రుద్రాక్షలతో అలంకరించారని వెల్లడించారు.
‘హరివరాసనం‘ పారాయణం తర్వాత మేల్శాంతి ఆలయ దీపాలను ఆర్పి గర్భగుడిని అధికారికంగా మూసివేశామని చెప్పారు. అనంతరం ఆలయ తాళాలను రాజకుటుంబ సభ్యుడికి అప్పగించినట్లు తెలిపారు.